న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ జంతు ప్రదర్శనశాల దాదాపు ఏడాది కాలం తర్వాత పునఃప్రారంభం కాబోతున్నది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కును తిరిగి తెరువాలని నిర్ణయించినట్లు జూ డైరెక్టర్ రమేశ్ పాండే తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు జూలో సందర్శకుల కోసం సదుపాయాలను మెరుగుపర్చామని, జూలోని జంతువుల సంఖ్య కూడా పెరిగిందని ఆయన వెల్లడించారు.
అయితే, మునుపటిలా కాకుండా స్పెసిఫిక్ టైమ్ స్లాట్స్లో సందర్శకులకు అనుమతిస్తామని ఢిల్లీ జూ డైరెక్టర్ రమేశ్ పాండే చెప్పారు. జూ దగ్గర ఎలాంటి టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవని, సందర్శకులు జూ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే ఎంట్రీ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. లేదంటే జూ ప్రవేశ ద్వారం వద్ద ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా సందర్శకుల టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు.
గత ఏడాది కాలంలో జూలో జంతువుల సంఖ్య భారీగా పెరిగిందని పాండే చెప్పారు. 2020, మార్చిలో జూలో మొత్తం జంతువుల సంఖ్య 1,005 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 1,200కు చేరిందన్నారు. అదేవిధంగా జంతు జాతుల సంఖ్య కూడా 83 నుంచి 88కి పెరిగిందని తెలిపారు. ఏప్రిల్ చివరికల్లా జూలోని జంతు జాతుల సంఖ్యను 100కు పెంచనున్నట్లు చెప్పారు.
కరోనా మహమ్మారి కారణంగా 2020, మార్చి నుంచి ఢిల్లీ జంతు ప్రదర్శనశాల గేట్లు మూతపడ్డాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు గత జనవరిలోనే జూను తెరిచే అవకాశం ఉన్నా అప్పుడు జూలో ఒక గుడ్లగూబలో ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ లక్షణాలు కనిపించడంతో తెరువలేదు. అయితే, అప్పటి నుంచి మొత్తం నాలుగు సార్లు జూలో సెరాలజికల్ సర్వేలు నిర్వహించగా ఆఖరి రెండు పర్యాయాలు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దాంతో జూను తిరిగి తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.