పట్నా : బీహార్లో ఘోర దుర్ఘటన జరిగింది. పూరిగుడిసెకు నిప్పంటుకొని మంటలు వ్యాపించి ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.
మృతి చెందిన చిన్నారులంతా 3 నుంచి 6 ఏండ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. అరియారియా జిల్లా పలాషి పోలీస్ స్టేషన్ పరిధిలోని కవయ్య గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పొలంలో తల్లిదండ్రులు గోదుమ పంట సాగు పనుల్లో నిమగ్నమై ఉండగా పూరిగుడిసెకు ఉన్నట్టుండి నిప్పంటుకుంది. గుడిసెలో ఆడుకుంటున్న పిల్లలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.
పూరిగుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు.