కైరో, ఏప్రిల్ 9: ఫారోల పాలనలో ఈజిప్టు సుసంపన్నంగా ఉన్న సమయంలో నిర్మించిన ఏటెన్ నగరాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు అనుకోకుండా కనుగొన్నారు. ప్రఖ్యాత ఫారో టూటామ్ఖామూన్ మృతి తర్వాత ఆయనను మమ్మీగా మార్చే క్రమంలో పూజలు నిర్వహించిన ఆలయాన్ని కనుగొనడానికి తవ్వకాలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు ఇసుక కింద కూరుకుపోయిన ‘ప్రాచీన నగరాన్ని’ గుర్తించారు. ఈజిప్టులోని లక్సర్ అనే ప్రాంతంలో కనుగొన్న ఈ నగరం 3,500 ఏండ్లనాటిదని తవ్వకాలు జరిపిన పురాతత్వవేత్త జహీ హవాస్ వెల్లడించారు. ఈజిప్టులో ఇప్పటివరకు గుర్తించిన ప్రాచీన నగరాల్లో ఇదే అతిపెద్దదని పేర్కొన్నారు. టూటామ్ఖామూన్ తాత ఆమెన్హోటెప్-3 దీనిని నిర్మించినట్టు భావిస్తున్నారు. ఈజిప్టు చరిత్ర అధ్యయనంలో టూటామ్ఖామూన్ సమాధి ఆవిష్కరణ తర్వాత మళ్లీ అంతటి ప్రాధాన్యం ఉన్న ఆవిష్కరణ ఇదేనని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ప్రాచీన ఈజిప్షియన్ల జీవన విధానంపై అధ్యయనం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. టూటామ్ ఖామూన్ సమాధిని 1922లో కనుగొన్నారు.
లక్సర్ ప్రాంతంలో పురాతత్వవేత్తలు తవ్వకాలు జరుపుతున్న క్రమంలో వారికి తొలుత మట్టి ఇటుకల నిర్మాణాలు కనిపించాయి. తవ్వుతూ వెళ్లగా ఉంగరాల్లాంటి బంగారు నగలు, రంగురంగుల మట్టి పెంకులు బయటపడ్డాయి. మట్టి ఇటుకలపై ఆమెన్హోటెప్-3 రాజముద్రలు ఉన్నాయి. నగరంలో బేకరీలు నిర్మించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పక్కా ఇండ్ల నిర్మాణాలు, ఇండ్లలో వాడే సామగ్రి కూడా బయల్పడింది. నగరంలో వీధుల వంటి నిర్మాణాలు ఉన్నాయి.