లక్నో: హోలీ నేపథ్యంలో ఒక స్వీట్ షాపు ఒక వెరైటీ ఫుడ్ను కస్టమర్ల ముందుకు తెచ్చింది. 1.5 కేజీల ‘బహుబలి ఖాజా’ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘చప్పన్ భోగ్’ షాపు ఇటీవల భారీ సైజులో ఉన్న ‘బహుబలి ఖాజా’ల తయారీ చేపట్టింది. 14 అంగుళాల పొడవు, 1.5 కేజీల బరువుతున్న ఈ భారీ ఖాజా తయారికి సుమారు అరగంట సమయం పడుతున్నది. పాల కోవా, కేసర్, బాదం, పిస్తా, చక్కెరతో కూడిన నోరూరించే ఈ ‘బహుబలి ఖాజా’ను రూ.1200కు అమ్ముతున్నారు.
కాగా, కస్టమర్ల ఆసక్తి మేరకు ఖాజాలోని పదార్థాలను బట్టి రేటు మారుతుందని మార్కెటింగ్ విభాగం అధిపతి షిట్జిత్ గుప్తా తెలిపారు. తమ వినియోగదారుల కోసం ప్రతి ఏటా ఒక వెరైటీని తెస్తుంటామని, ఇందులో భాగంగా ఈ ఏడాది ‘బాహుబలి ఖాజా’ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, హోలీ వేళ ఈ భారీ ఖాజాను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.