ఆగ్రా : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. వైరస్తో పాటు పలు రకాల ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాల మధ్య ఆగ్రాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ బారినపడి కోలుకున్న తొమ్మిది మందికి మళ్లీ ఫంగస్ సోకింది. అయితే, ఈ సారి బాధితుల్లో లక్షణాలు కనిపించకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఊరట కలిగించే విషయమేంటంటే.. రోగులను దవాఖానాల్లో అడ్మిట్ చేసుకోకుండా.. యాంటీ ఫంగల్ మందులపై చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును కొనసాగిస్తున్నారు. ఆగ్రాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి 98 మంది రోగులు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గినా.. రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు దవాఖానా వార్డు నోడల్ అధికారి డాక్టర్ అఖిల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతంలో ఫంగస్ బారినపడి చికిత్స పొందిన తొమ్మిది మందిలో ఇటీవల మళ్లీ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ సారి రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఎంఆర్ఐ పరీక్షలు చేయగా.. ఫంగస్ ఆనవాళ్లు కనిపించాయి.
బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రోగులందరూ మధుమేహ పరీక్షలు చేయించుకున్న సమయంలో.. షుగర్ నియంత్రణలో లేదని తేలింది. ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం, సరైన సమయంలో మందులు వేసుకోకపోవడమే ఫంగస్ మళ్లీ సోకడానికి కారణమని పేర్కొంటున్నారు. ఫంగస్ బారినపడిన రోగులు సంయమనం పాటించాలని, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.
ఎస్ఎన్ మెడికల్ కాలేజీలోని బ్లాక్ ఫంగస్ వార్డులో ఇప్పటి వరకు 98 మంది రోగులు చికిత్స పొందగా.. 14 మంది రోగులను మరణించారు. చాలా మంది రోగుల్లో దవడలు, కళ్లను తొలగించారు. అయితే, గత నెల రోజుల్లో కొత్త కేసులు గుర్తించలేదు. ఫంగస్ను ఎంత త్వరగా గుర్తిస్తే.. చికిత్స అంత విజయవంతమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తే.. తక్కువ మోతాదులో ఇవ్వాలని, అనవసర వాడకాన్ని నివారించాలని పేర్కొంటున్నారు.