నార్కట్పల్లి, ఏప్రిల్ 7 : ఓటరు జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని ఎంపీడీఓ సాంబశివరావు కోరారు. త్వరలో కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే గురువారం వరకు లిఖిత పూర్వకంగా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు. మండలంలోని 10 గ్రామాల్లో 20 వార్డుల్లో ఎన్నికలు జర గనున్నట్లు చెప్పారు. జాబితా తుది ముసాయిదాను ఈనెల 12న ప్రచురించనున్నట్లు తెలిపారు.
మర్రిగూడ : ఓటరు జాబితా సవరణకు సహకరించాలని ఎంపీడీఓ రమేశ్ దీన్దయాళ్ కోరారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటరు జాబితా ప్రదర్శించామన్నారు. ఓటర్ జాబితా సవరణకు గురువారం అవకాశం ఉన్నందున రాజకీయ పక్షాలు సహకరించాలన్నారు. సమావేశంలో అన్ని పార్టీల నాయకులు దంటు జగదీశ్వర్, రామదాసు శ్రీనివాస్, చెర్కు శ్రీరాంగౌడ్, ఈదుల భిక్షంరెడ్డి, వెంకట్రాం పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : మండలంలోని వివిధ గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జి ఎంపీడీఓ సీవీఎన్రావు బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నికలు నిర్వహించే పంచాయతీల్లో ఓటరు జాబితా అందుబాటులో ఉందని అభ్యంతరాలు గురువారం లోపు తెలపాలన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
త్రిపురారం: ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎంపీడీఓ అలివేలుమంగమ్మ కోరారు. అంజనపల్లి, చెన్నాయిపాలెం గ్రామాల సర్పంచులు మరణంతో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులతో బుధవారం కార్యాలయంలో సమావేశం నిర్వ హించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ సత్యప్రభ, ఎంపీఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో 11న ఓటర్ల తుది జాబితా
పట్టణంలోని 26వ వార్డులో ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ వార్డు ఓటర్ల జాబితాపై మున్సిపల్ అధికారులు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించారు. ఈ సమావేశంలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ 28వ వార్డులో ఉండాల్సిన ఓట్లు 48 వ వార్డులో ఉన్నాయని వీటిని సరి చేయాలని కోరారు. దీనిపై అధి కారులు మాట్లాడుతూ గతంలో చేసిన వార్డుల పునర్విభజన మాదిరిగానే ఉందని, ఇప్పుడు ఓటర్ల జాబితాను మార్చలేమన్నారు. వార్డు పరిధిలో 18 సంవత్సరాలు నిండిన యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితాపై గురు, శుక్రవారం అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 11న తుది జాబితా వెల్లడిస్తామని మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా