న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విట్టర్కు ఇప్పటివరకూ లభిస్తున్న ‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ను తొలిగించినట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్లు చేసే అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మే 26 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నిబంధనలను ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటించినప్పటికీ, ట్విట్టర్ వీటిపట్ల అలసత్వం వహించిందని కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేస్తూ వస్తున్నది. దీనిపై పలుమార్లు నోటీసులు జారీచేసినప్పటికీ, ట్విట్టర్ నుంచి సరైన స్పందనలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ (సీసీవో), నోడల్ కాంటాక్ట్ పర్సన్ (ఎన్సీపీ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ (జీవో) నియామకంపై గడువు దాటిపోయినా ఆ సంస్థ ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నది. దీంతో ట్విట్టర్కు ఉన్న ‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ను రద్దు చేస్తున్నట్టు ఆయా వర్గాలు తెలిపాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. మరోవైపు, ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఓ అధికారిని నియమించినట్లు ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని ఐటీశాఖకు త్వరలో తెలియజేస్తామని పేర్కొంది. అయితే, ట్విట్టర్ గతంలో నియమించిన రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ భారత్లోని ట్విట్టర్ సంస్థకు చెందిన వారు కాదని, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పేరు, ఇతరత్రా వివరాలు ఇంకా ప్రభుత్వానికి అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ రద్దుపైపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు.
ఏమిటీ ‘మినహాయింపు’
సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు ఆ పోస్టులకు ఆ సంస్థ బాధ్యత వహించాల్సిన అవసరంలేదు. అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన వారిపై మాత్రమే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఆయా సంస్థలకు సెక్షన్ 79 ఆఫ్ ఐటీ చట్టం, 2000 ప్రకారం ‘జవాబుదారీతనం నుంచి మినహాయింపు’ను ఇచ్చారు. అయితే, కొత్త ఐటీ నిబంధనలు పాటించనందుకు ట్విట్టర్కు ఉన్న ఈ మినహాయింపును కేంద్రం రద్దు చేసింది. దీంతో ట్విట్టర్లో పోస్ట్ అయ్యే ప్రతి అభ్యంతర కంటెంట్కు దాన్ని పోస్టు చేసిన వారితో పాటు ప్రచురించిన ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే భారత శిక్షాస్మృతి ప్రకారం.. ఎలాంటి క్రిమినల్ చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత్లోని ట్విట్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సిద్ధంగా ఉండాలి.
ఉద్దేశపూర్వక ధిక్కరణే: రవిశంకర్
కొత్త ఐటీ నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ పాటించలేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఎన్నిసార్లు అవకాశమిచ్చినా ఆ సంస్థ నుంచి సరైన స్పందనలేదన్నారు. వాక్స్వేచ్ఛ గురించి ఎప్పుడూ మాట్లాడే ట్విట్టర్ ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ‘మే 26 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ధిక్కరించింది’ అని స్వదేశీ సోషల్మీడియా వేదిక ‘కూ’లో రవిశంకర్ పోస్ట్ చేశారు.
ట్విట్టర్పై బీజేపీ కక్షసాధింపు: అసదుద్దీన్
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మీడియాను తన ప్రచారానికి అనుకూలంగా వాడుకోవటం అలవాటైన బీజేపీ.. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వేదికలను ధ్వంసం చేస్తున్నదని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ట్విట్టర్పై బీజేపీ కక్ష సాధిస్తున్నదని విమర్శించారు. ఇక బీజేపీ నాయకులు ‘మ్యానిప్యులేటెడ్’ మీడియా ద్వారా ట్వీట్ చేస్తారని వ్యాఖ్యానించారు.
ట్విట్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు
మత కల్లోలాల్ని రెచ్చగొట్టేలా ఉన్న ఓ వీడియోను షేర్ చేశారన్న ఆరోపణలతో ట్విట్టర్, న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్’, ఇద్దరు జర్నలిస్టులు, మరో నలుగురిపై యూపీలోని ఘాజియాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోను ది వైర్ జర్నలిస్టులతో పాటు, నలుగురు కాంగ్రెస్ నేతలు ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ట్విట్టర్పైనా కేసు నమోదైంది.
‘జవాబుదారీతనం నుంచి వెసులుబాటు’ కోల్పోయిన తొలి సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ – విశ్లేషకులు