హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తుండగా.. దానిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం తగిన తోడ్పాటునివ్వడం లేదు. కొండంత అడిగితే గోరంత ఇస్తున్నది. రాష్ట్రంలో మూడు రోజులకు మాత్రమే సరిపోయే వ్యాక్సిన్లు ఉన్నాయని, 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు పంపిణీ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖకు లేఖ రాశారు. ఇది రాసిన రెండురోజులకు స్పందించిన కేంద్రం సోమవారం రాత్రి కేవలం 4.64లక్షల డోసులను మాత్రమే పంపిణీచేసింది. కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 26.78 లక్షల డోసులు రాగా, ఇందులో 22.50 లక్షల డోసులు వేశారు. తాజాగా వచ్చిన డోసులతో కలిపి రాష్ట్రంలో 8.92లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐదు రోజులకు మాత్రమే సరిపోతాయని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
వ్యాక్సిన్ల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం, 60శాతం పైగా వ్యాక్సిన్లు కేవలం 8 రాష్ట్రాలకే పంపిణీ అయ్యాయి. ఇందులో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమబెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ ఉన్నాయి. అత్యధికంగా 89,49,560 డోసులు (9.92శాతం) మహారాష్ట్రకు పంపిణీ అయ్యాయి. తెలంగాణకు ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసులు 2.5 శాతం కూడా ఉండవని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ల పంపిణీలో ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాలు, బీజేపీ పాలిత రాష్ర్టాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రానికి సోమవారం వచ్చిన వ్యాక్సిన్లు..
కొవాగ్జిన్ 2 లక్షలు
కొవిషీల్డ్ 2.64 లక్షలు
మొత్తం 4.64 లక్షలు
వ్యాక్సిన్ల పంపిణీలో ఎలాంటి వివక్ష చూపించకూడదు. కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు, వ్యాక్సినేషన్లో వెనుకబడ్డ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో దరఖాస్తులు చేసుకున్న ఇతర వ్యాక్సిన్లకు అనుమతివ్వాలి. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది, పాత, కొత్త వేరియంట్లపై 91శాతం సామర్థ్యం చూపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కాబట్టి అనుమతివ్వడం మంచిది. ఇదే తరహాలో మరో 4-5 వ్యాక్సిన్లు అనుమతుల కోసం చూస్తున్నాయి. దీంతోపాటు నెలకు 15కోట్ల డోసులు ఉత్పత్తి అయ్యేలా తయారీ కంపెనీలకు మద్దతు అందించాలి. వ్యాక్సిన్లను విరివిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంతోపాటు, వయోపరిమితిని ఎత్తివేయాలి. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకా ఉత్సవ్ వంటి ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి.
-డాక్టర్ రంగారెడ్డి బుర్రి, ప్రెసిడెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా