హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్యుత్తు జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వాక్సినేషన్లో ప్రాధాన్యమివ్వాలని కేంద్రప్రభుత్వం సూచించింది. వారికి వెంటనే మాస్ వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం అన్నిరాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ‘విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్తు సంస్థల ఉద్యోగులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. దీంతో కరోనా బారిన పడుతున్నారు. పలువురు ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు సంస్థల ఉద్యోగులను ప్రాధాన్యవర్గంగా గుర్తించి వెంటనే వ్యాక్సినేషన్ చేయాలి’ అని కోరుతూ ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) తదితర జాతీయస్థాయి విద్యుత్తు కార్మిక సంఘాలు ప్రధాని మోదీ, కేంద్రవిద్యుత్తుశాఖామంత్రికి తాజాగా లేఖలు రాశాయి. వీటిని పరిశీలించిన కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ కార్యదర్శి అలోక్కుమార్ అన్నిరాష్ర్టాల సీఎస్కు లేఖ రాస్తూ.. వెంటనే విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, డిస్కంలతోపాటు స్టేట్ లెవల్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) వంటి కీలకమైన విభాగాల్లో మాస్ వ్యాక్సినేషన్కు ఏర్పాట్లుచేసి ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ వేసేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలో వందల మందికి
తెలంగాణవ్యాప్తంగా విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వందల మంది కరోనా బారినపడ్డారు. ఈనెల ఒకటి నుంచి 22 నాటికే సుమారు 775 మంది ట్రాన్స్కో, జెన్కో, రెండు డిస్కంల పరిధిలో ఉద్యోగులకు కొవిడ్ పాజివిట్గా నిర్ధారణ అయిందని అధికారులు చెప్తున్నారు. ఇందులో జెన్కోలో 113, ట్రాన్స్కోలో 30, ఎస్పీడీసీఎల్లో 328, ఎన్పీడీసీఎల్లో 306 మంది ఉద్యోగులు ఉన్నట్టు పేర్కొంటున్నారు. విద్యుత్తు సంఘాలు మాత్రం 1,200 మందికిపైగా కరోనా బారినపడ్డారని, ఇందులో ఆర్టిజన్ల నుంచి ఇంజినీర్ల వరకు ఉన్నారని చెప్తున్నాయి. ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ వేయించాలని విజ్ఞప్తి చేశాయి. కేంద్రం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో.. వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో నాలుగు విద్యుత్తు సంస్థల్లో సుమారు 28 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు, మరో 5 వేల మంది కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 55 వేల మంది వరకు ఉన్నారు.