న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్లో విశ్వాసం ఇనుమడించిందని శివసేన పేర్కొంది. మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ పూర్తికాలం అధికారంలో ఉంటుందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆశాభావం వ్యక్తం చేసింది. బెంగాల్లో మమతా బెనర్జీ తరహాలో సీబీఐ, ఈడీలను ఎంవీఏ ఎదుర్కోవాలని ఆకాంక్షించింది.
కేంద్ర ఏజెన్సీలను పురమాయించి మంత్రులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంలో ఇబ్బందులు సృష్టించాలని రాష్ట్రంలో విపక్షం ప్రయత్నిస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ ఠాక్రే, ప్రధాని మోదీ సమావేశంతో మహారాష్ట్ర బీజేపీ నేతల్లో ఆశలు రేపినట్టే పవార్, ఠాక్రే భేటీతో సంకీ్ర్ణ సర్కార్ ఐదేండ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేస్తుందనే విశ్వాసం నెలకొందని సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది.