న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బ్యాంకులో లూటీ జరిగింది. షాదారా ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు కన్నం వేసిన దొంగలు రూ.55 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. బ్యాంకు పక్కన నిర్మాణం జరుగుతున్న మరో బిల్డింగ్ గోడలను పగులగొట్టి యూనియన్ బ్యాంక్లోకి చొరబడ్డారు. శుక్రవారం, శనివారం వివిధ కస్టమర్ల నుంచి సేకరించిన డిపాజిట్ సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే బ్యాంకు లాకర్లలో ఉన్న నగలు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. బ్యాంకులో చోరీ అయినట్లు తెలియగానే.. ఆందోళన చెందిన కస్టమర్లు ఆ బ్యాంకు ముందు క్యూ కట్టారు. బ్యాంకులో అమర్చిన సీసీటీవీకి ఓ దొంగ చిక్కాడు. ఎంత మంది ఈ దొంగతనంలో పాల్గొన్నారో తెలియాల్సి ఉంది. నేరానికి పాల్పడిన వారందరి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.