ముంబై: ఏడేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సుకు పెద్దగా ఏమీ చేయలేకపోయిందని శివసేన విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని కూడా చెప్పలేమని వ్యాఖ్యానించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినప్పటికీ సమయమంతా మహమ్మారి నియంత్రణలోనే గడిచిపోయిందని తెలిపారు. దేశ సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా చేయాల్సి ఉందన్నారు.
మహమ్మారి సంక్షోభం కారణంగా దేశంలో ధరలు మండిపోతున్నాయని సంజయ్ రౌత్ తెలిపారు. అలాగే అనేక మంది ఉపాధి కోల్పోయారన్నారు. ప్రజలు కనీసం వారి నిత్యావసరాలను తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజలు పెద్దగా ఏమీ కోరుకోవడం లేదని, నిత్యావసరాలు అందితే చాలన్న భావనలో ఉన్నారని తెలిపారు. గత కొన్నేండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేసిందో లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.