ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాజకీయ నేతలతో టచ్లో ఉన్నానని, కరోనా వల్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోందని, ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే, అన్ని రాష్ట్రాలు ఓపెన్గా కరోనా పరిస్థితిపై చర్చించుకునే వీలు ఉంటుందని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
దేశవ్యాప్తంగా యుద్ధం లాంటి వాతావరణం నెలకొన్నదని, అంతటా అయోమయం, ఆందోళన నెలకొన్నట్లు ఆయన అన్నారు. కోవిడ్ పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని మోదీని సీఎం ఉద్దవ్ కలిసే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోదీ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నట్లు తేలింది. ఈ అంశంపై బీజేపీ, శివసేన మధ్య రాజకీయ వివాదం నెలకొన్నది. మహారాష్ట్రకు కావాల్సినంత మందులు, ఆక్సిజన్ అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు.