ముంబై: శివసేన మునుపటి కంటే బలంగా ఉద్భవించిందని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన, అధికారం కోల్పోయిన తర్వాత కొంతమందికి ఇది కడుపు మంటగా ఉన్నదంటూ పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. వారు తమ బాగోగుల గురించి చూసుకోవాలని ఉద్ధవ్ సూచించారు. తాను వారికి మందులు ఇవ్వలేనని, కానీ పొలిటికల్ మెడిసిన్ ఇస్తానని వ్యాఖ్యానించారు.
హిందుత్వ అనేది సంస్థ కాదని, హిందుత్వం గుండె నుంచి వస్తుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తాము కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినందున హిందుత్వాన్ని శివసేన వదిలిపెట్టిందని వారు (బీజేపీ) అంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎప్పటి వరకు కొనసాగుతుందోనని కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారని, తాము అది కూడా చూస్తామని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాము పేదల కోసం పని చేయాల్సి ఉన్నదని సీఎం ఉద్ధవ్ తెలిపారు.