తెలుగుయూనివర్సిటీ, ఏప్రిల్ 14: సాంస్కృతిక దిగ్గజం, యువకళావాహిని వ్యవస్థాపకుడు వై.కే నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం కూకట్పల్లిలోని ఓ దవాఖానలో కన్నుముశారు. మూడు రోజుల నుంచి దగ్గు, తీవ్ర జలుబుతో బాధపడుతున్న నాగేశ్వరరావు కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్గా నిర్ధారణ జరిగింది. హఠాత్తుగా పల్స్ పడిపోవడంతో వివేకానందనగర్ హోలిస్టిక్ దవాఖానలో కుటుంబ సభ్యులు చేర్పించి వైద్య సేవలు అందిస్తుండగానే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాంస్కృతిక రంగ కార్యక్రమాల నిర్వహణలో ఆయన ఐదు దశాబ్దాలుగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు కళాకారులు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. వై.కే మరణం సాంస్కృతిక రంగానికి తీరని లోటని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ రమణాచారి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.