గజ్వేల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి సాధించిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ చేశారు. గజ్వేల్ సమీకృత కార్యాలయ ప్రాంగణంలో గడా ముత్యంరెడ్డి, మున్సిపల్ కార్యాలయం, సంగాపూర్ మదర్సాలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ, సమీకృత మార్కెట్ కార్యాలయాల వద్ద ఏఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అమరావతి శ్యాంమనోహర్, కోమటిబండ మిషన్ భగీరథ సంప్హౌజ్ వద్ద ఈఈ రాజయ్య జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎఫ్ఢీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లి కష్టాలు పడ్డారని, ప్రత్యేక రాష్ట్రంలో ఇంటింటికీ గోదావరి శుద్ధ జలాలను ప్రతిరోజూ అందిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగ పెన్షన్లు, కేసీఆర్ కిట్లు అందిస్తున్నామన్నారు. అలాగే రైతుబంధు, రైతుబీమాతో పాటు సబ్సిడీపై రైతులకు ఎరువులు విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోనసీమను తలదన్నేలా గ్రామ గ్రామానికి గోదావరి జలాలను కాల్వల ద్వారా పంపి వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ త్యాగనిరతితోనే ప్రత్యేక రాష్ట్రం సాధించడంతోపాటు అలుపెరుగని శ్రమతో బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్లో దేశానికి, ప్రపంచానికి తెలంగాణ పూర్తి మార్గనిర్దేశం చేసే స్థాయి ఎదుగుతున్నదన్నారు. గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, జడ్పీటీసీ పంగమల్లేశం, కౌన్సిలర్లు, ఇరిగేషన్ ఈఈ నారాయణ, డీఈఈ పవన్కుమార్, ఎఫ్ఆర్వో కిరణ్కుమార్, ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరాజమ్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.