ములుగురూరల్/వెంకటాపురం (నూగూరు)/ మహదేవపూర్ , మార్చి30: మల్లంపల్లి అంగడి వేలం పాటను మంగళవారం సర్పంచ్ చంద కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు. డీఎల్పీవో దేవరాజు, ఎంపీవో హన్మంతరావు హాజరై తైబందీ బజార్కు వేలం పాట నిర్వహించగా మల్లంపల్లికి చెందిన గొల్లెన సారంగపాణి రూ.3లక్షల 25వేలకు కైవసం చేసుకున్నారు. గొర్రెలు, మేకల వేలంలో కుమ్మరిపల్లికి చెందిన నూనేటి ఐలయ్య రూ.12లక్షల 50వేల పాట పడి దక్కించుకున్నారు. పశువుల రహదారి వేలం గత వేలం కంటే తక్కువగా రూ.2లక్షల 50వేలు పాడగా డీఎల్పీవో ఈ వేలం పాటను బుధవారానికి వాయిదా వేశారు. పంచాయతీ కార్యదర్శి కొండల్రెడ్డి, కారోబార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని ఆలుబాక గ్రామ పంచాయతీ పరిధిలోని ఆలుబాకలో సంతలో ఫీజు వసూలు చేసేందుకు మంగళవారం జీపీ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రూ.36,500కు కైవసం చేసుకున్నారు. ఎంపీవో రహీమ్, సర్పంచ్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలో మంగళవారం తైబజార్ వేలం నిర్వహించారు. మండలకేంద్రానికి చెందిన పోతరవేని వంశీ రూ.2.75వేలకు, పశువుల అంగడిని మండలకేంద్రానికి చెందిన శ్రీపతిపోచం రూ.25,100కు దక్కించుకున్నారు.
గ్రామసభ ద్వారానే వేలం నిర్వహించాలి
వెంకటాపురం (నూగూరు): పెసా గ్రామసభ ద్వారానే వేలం నిర్వహించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు పూనెంసాయి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెసా గ్రామసభ ద్వారా 1/3 వంతు మెజారిటీతో నిజమైన నిరుపేద ఆదివాసీలను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో పూనెం సూర్యం, మడకం రవి, మోహన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.