కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ ముందు అసాధారణ రీతిలో నిరసన చేపట్టారు. గవర్నర్ జగదీప్ ధనఖర్ కరోనా పరిస్థితులను పట్టించుకోకుండా, ఇతర అంశాలపై దృష్టి సారించడం బాధాకరమైన విషయమంటూ కోల్కతా నాగరిక్ మన్చా.. రాజ్భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు గొర్రెలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మన్చా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. కొవిడ్ రోగులకు సరిపడ బెడ్లు లేవు. రోగులు చనిపోతున్నారు. ఇంత జరుగుతుంటే గవర్నర్ ఇవేవీ పట్టించుకోకుండా, ఇతర అంశాలపై దృష్టి సారించడం సరికాదన్నారు. అందుకే గొర్రెలతో నిరసన చేపట్టామని తెలిపారు.
గవర్నర్ పుట్టిన రోజునే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్భవన్ ముందు గొర్రెలతో నిరసన చేపడితే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారని గవర్నర్ మండిపడ్డారు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని పోలీసులను గవర్నర్ ఆదేశించారు.