పాట్నా : కలలో అత్యాచారం చేయడమేంటని అనుకుంటున్నారా? మనకు వినడానికి, చదవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఓ మహిళ మాత్రం ఇది నిజమేనని వాదిస్తోంది. ప్రతి రోజు ఓ మంత్రగాడు తనకు కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బీహార్ ఔరంగాబాద్ జిల్లాలోని గాంధీ మైదాన్లో ఉంటున్న ఓ మహిళ తన కుమారుడితో కలిసి నివాసముంటోంది. అయితే ఆమె కుమారుడు అస్వస్థతకు గురికావడంతో.. ఈ ఏడాది జనవరిలో మంత్రగాడు ప్రశాంత్ చతుర్వేదిని ఆశ్రయించింది. రోగం బారిన పడ్డ కుమారుడు త్వరగా కోలుకోవాలంటే మంత్రం జపించి, కొన్ని కార్యక్రమాలు చేయాలని చతుర్వేది ఆమెకు చెప్పాడు. అతను చెప్పినట్లు చేసినప్పటికీ 15 రోజుల తర్వాత కుమారుడు మరణించాడు.
ఇక తన కుమారుడు చనిపోవడంతో సదరు మహిళ కాళీ బారి టెంపుల్లో ఉంటున్న చతుర్వేది వద్దకు వెళ్లింది. తన బిడ్డ ఎందుకు చనిపోయాడో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ సమయంలో తనపై చతుర్వేది అత్యాచారం చేసేందుకు యత్నించాడని, చనిపోయిన కుమారుడు అతని నుంచి కాపాడడని మహిళ వాదిస్తోంది. అప్పట్నుంచి తన మాంత్రిక శక్తులను ఉపయోగించి చతుర్వేది తనను కలలో అత్యాచారం చేస్తున్నాడని ఆమె పేర్కొన్నది.
మంత్రగాడు చతుర్వేది తనను కలలో అత్యాచారం చేస్తున్నాడని బాధిత మహిళ కుద్వా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చతుర్వేదిని అదుపులోకి తీసుకుని విచారించారు. చతుర్వేది అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె వాదనను పోలీసులు తోసిపుచ్చారు. చతుర్వేదితో బాండ్పై సంతకం తీసుకుని ఆయనను పోలీసులు విడుదల చేశారు.