న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేట అయ్యారు. ఈ సమావేశానికి పవార్ వెంట చెరకు రైతుల సమాఖ్యకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా హాజరయ్యారు. చెరకు సహకార సంఘాలు, విపత్తు నిర్వహణ వ్యవస్ధల వంటి అంశాలపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.
చెరుకు విక్రయ ధరల పెంపు, పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అమిత్ షాను పవార్ కోరారు. మెరుగైన సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా కొంకణ్ ప్రాంతంలో జాతీయ విపత్తు నిర్వహణ బలగాల ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంకణ్ ప్రాంతం ఏటా వరదలు, తుపాన్లు, కొండచరియలు విరిగిపడటం వంటి పలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోందని పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు.