కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగాను 292 స్థానాల్లో ట్రెండ్స్ అందుబాటులోకి రాగా 206 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది. దాంతో టీఎంసీ గెలుపు ఖాయమనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి మమతకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా మమతా బెనర్జీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. ఇక ప్రజాసంక్షేమం కోసం మనం మన కార్యాలను కొనసాగిద్దాం. కలిసి కట్టుగా పనిచేసి కరోనా మహమ్మారిని తరిమి కొడుదాం’ అని పవార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా మమతాబెనర్జికి గ్రీటింగ్స్ చెప్పారు. విచ్ఛిన్నర శక్తులను ఓడించారని వ్యాఖ్యానించారు.