న్యూఢిల్లీ : మిస్టర్ సేన్.. ప్లీజ్ సభ నుంచి వెళ్లిపోండి అంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనో వేదనను వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం జరిగిన ఘటనను ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శాంతను సేన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. సభలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని, దురదృష్టవశాత్తు సభా వ్యవహారాలు దిగజారిపోయాయని వెంకయ్య అన్నారు. ఇవాళ రాజ్యసభ ఉదయం సమావేశం అయిన తర్వాత చైర్మెన్ వెంకయ్య ప్రకటన చేశారు. గురువారం ఐటీ శాఖ మంత్రి వైష్ణవ్ చేతుల్లోంచి పేపర్లను లాగి, చించివేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. అలాంటి ఘటన మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి లాంటి చర్యలే అని వెంకయ్య అన్నారు. మంత్రి చేతుల్లోంచి పేపర్లు లాగిన టీఎంసీ ఎంపీ శాంతను సేన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
కేంద్ర సహాయ మంత్రి వీ మురళీధరన్.. సేన్ సస్పెషన్పై తీర్మానం ప్రవేశపెట్టారు. వర్షాకాల సమావేశాలు పూర్తి అయ్యే వరకు సేన్ను సస్పెండ్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా సస్పెన్షన్ను తీర్మానించారు. అయితే ఆ తీర్మానాన్ని తృణమూల్ ఫ్లోర్ లీడర్ సుఖేందు శేఖర్ రాయ్ వ్యతిరేకించారు. ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వ్యతిరేకిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో సభను వాయిదా వేశారు. 12 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత.. ఎంపీ శాంతను సేన్ హౌజ్లోనే ఉండిపోయారు. సభ నుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించారు. తృణమూల్ ఎంపీలు ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. సభ నుంచి వెళ్లిపోవాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ .. ఎంపీ శాంతను సేన్ను కోరారు. ఆ తర్వాత సభను అరగంట వాయిదా వేశారు.