న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో దేశ రాజధానిలోని జీబీ రోడ్ సెక్స్ వర్కర్లు మరోసారి నిరాశ్రయులయ్యారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వారికి పలు స్వచ్ఛంద సంస్థలు ఆసరాగా నిలిచాయి. జీబీ రోడ్డులోని 800 సెక్స్ వర్కర్ల కుటుంబాలకు వాలంటీర్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ ఔదార్యం చాటుకున్నారు. ఈ ప్రాంతంలోని మహిళల సాధకబాధకాలను గుర్తెరిగిన తాము విరాళాలు సేకరించి రేషన్ ప్యాకెట్లను పంచామని ఇందులో పప్పు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, నూనెలతో కూడిన ఈ ప్యాకెట్లు వారికి 15 రోజులకు సరిపోతాయని వ్రిక్షిత్ ఫౌండేషన్ వ్యవస్ధాపకుడు శంకర్ సింగ్ వెల్లడించారు.
త్వరలో ఈ ప్రాంతంలో మహిళలకు తిరిగి వాడే శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తామని సింగ్ చెప్పారు. సెక్స్ వర్కర్లకు రేషన్ కార్డులు లేనందున వారికి ప్రభుత్వం నుంచి సాయం అందడం కష్టమని అందుకే తాము వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చామని మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన అవధేష్ యాదవ్ తెలిపారు. ఇక ఈ ప్రాంతంలో దాదాపు 2000 మంది సెక్స్ వర్కర్లు ఉంటారని ఆయన వెల్లడించారు.