పల్లె ప్రగతి’లో దూసుకుపోతున్న పంచాయతీ
చెత్త నిర్వహణలో జిల్లాస్థాయి పురస్కారం
నర్సరీ, ప్రకృతి వనాలతో పల్లెకు పచ్చందాలు
అన్ని వసతులతో సమకూరిన వైకుంఠధామం
కరకగూడెం, ఏప్రిల్ 12: నిన్నమొన్నటి దాకా తాగునీటి కోసం అరిగోస పడిన గిరిజనులు ఇప్పుడు ‘మిషన్ భగీరథ’తో శుద్ధజలం తాగుతున్నారు. బురదమయంగా ఉన్న వీధులు ఇప్పుడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు వీధి దీపాలు లేక రాత్రిళ్లు అంధకారంగా ఉండేవి. ఇప్పుడు విద్యుత్ కాంతులతో కాంతులీనుతున్నాయి. గతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపించేది. అలాంటిది చెత్త నిర్వహణతో పాటు ఎరువుల తయారీ(సెగ్రిగేషన్)లో ఏకంగా జిల్లాస్థాయి అవార్డే దక్కించుకున్నది కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం పంచాయతీ. పేరుకు చిన్నపంచాయతీ అయినప్పటికీ పెద్ద లక్ష్యాలను చేరుకున్నది. పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామ జనాభా 523 కాగా ఓటర్లు 500 మంది ఉన్నారు.
జరిగిన అభివృద్ధి ఇలా..
పంచాయతీకి నెలనెలా విడుదలయ్యే రూ.86 వేల నిధులతో పాలకవర్గం పాలన చేపడుతున్నది. రూ.4 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం పంచాయతీకి కొత్తకళను తీసుకువచ్చింది. రూ.2.50 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు పారిశుధ్య నిర్వహణకు ఉపయోగపడుతున్నది. గ్రామంలో రూ.10 లక్షల నిధులతో అన్ని హంగులతో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. ఇవేకాక రూ.1.40 లక్షలతో ఏర్పాటు చేసిన ట్యాంకర్తో మొక్కల పెంపకం సులభమైంది. రూ.1.70 లక్షలతో సమకూర్చిన ట్రాలీతో చెత్త సేకరణ సులువైంది. గ్రామంలోకి ప్రవేశించగానే రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలో ఏర్పాటైన నర్సరీలో వేలాది మొక్కలు పెరుగుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా పాడుబడిన బావులు మూతపడ్డాయి.
ఎరువుల తయారీలో అవార్డు
పక్కాగా చెత్త నిర్వహణ చేపడుతున్నందుకు గాను ఇటీవల సిగ్రిగేషన్ విభాగంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పంచాయతీకి సమకూరిన ట్రాక్టర్ సాయంతో కార్మికులు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ సూపర్ డ్యామ్తో ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి..