బంగారు ఆభరణాలు, బైక్,సెల్ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ తరుణ్జోషి
వర్ధన్నపేట/సుబేదారి, మే 30 : పోలీసు పేరుతో బంగారం అపహరించిన వ్యక్తిని వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీపీ తరుణ్జోషి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా దామచర్ల మండలం గణేశ్పహాడ్ గ్రామానికి చెందిన బానోత్ వెంకటేశ్(28) బీఎస్ఎఫ్కు 2018లో ఎంపికై శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే తిరిగి ఇంటికి వచ్చాడు. ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ శిక్షణ తీసుకుంటున్నాడు.
ఈక్రమంలో అదే ప్రాంతంలో ఫ్యాన్సీ షాపులో పనిచేస్తున్న యువతి పరిచయం కాగా, అది కాస్తా ప్రేమగా మారింది. ఈనెల 21వ తేదీన తాను ప్రేమించిన యువతిని అదే బైక్పై ఎక్కించుకుని నెక్కొండకు తీసుకువెళ్లి రాత్రి అక్కడే నిద్రించాడు. 22వ తేదీన తెల్లవారుజామున బీఎస్ఎఫ్లో శిక్షణ పొందుతున్న సమయంలో ఉపయో గించిన జంగిల్ డ్రెస్ వేసుకుని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి నుంచి మిర్యాలగూడకు ద్విచక్రవా హనంపై బయలుదేరాడు. రాయపర్తి మండలంలోని జయరామ్తండా క్రాస్రోడ్డు వద్ద బ్యాగుతో వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తితో తాను తొర్రూరులో పోలీసునని చెప్పి, లాక్డౌన్ అమలులో ఉన్నందున ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించాడు. తాను వరంగల్ నుంచి బంగారాన్ని తీసుకుని తొర్రూరుకు వెళ్తు న్నానని చెప్పడంతో సదరు వ్యక్తి వద్ద ఉన్న బ్యాగును, సెల్ఫోన్లను లాక్కొని ఉడాయించాడు. దీంతో బాధితుడు శంకర్ వర్ధన్నపేట పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి టెక్నాలజీని ఉపయోగించి రాయపర్తి వద్ద వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి సుమారు రూ.3.50లక్షల విలువ చేసే ఆభరణాలతోపాటు ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ వివరించారు. కాగా, నిందితుడిని పట్టుకున్న ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ విశేశ్వర్, వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గడ్ ఎస్సైలు వంశీకృష్ణ, కిశోర్ను సీపీ తరుణ్జోషి అభినందించారు.