తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ లు, కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మసీలు సైతం మందులను ప్రజల ఇంటి వద్దకే చేర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. మందుల షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకూ ఇది ఉపకరిస్తోంది. మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మందుల డోర్ డెలివరీ కీలకంగా మారిందని ఆల్ కేరళ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి పేర్కొన్నారు.
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేందుకు విముఖత చూపుతూ ఈ- ఫార్మసీల్లో ఔషధాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. మందుల హోండెలివరీని పలువురు కస్టమర్లు కోరుతున్నారని, వీరి ఆర్డర్లను స్వీకరించి, డోర్ డెలివరీ చేసేందుకు మెడికల్ షాపుల సిబ్బంది ఓవర్ టైమ్ పనిచేస్తూ శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజలు తమకవసరమైన మందులను సులభంగా గుర్తించి ఆర్డర్ చేసేందుకు తాము ఓ కార్యాలయంతో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా మందుల జాబితా పంపి ఆన్ లైన్ లో చెల్లింపులు జరిపితే మందులను కస్టమర్ల ఇంటికి చేరవేస్తున్నామని చెప్పారు.