వెల్గటూర్లో ఎల్లంపల్లి నిర్వాసిత యువత 348మందికి 6.96కోట్ల ప్యాకేజీ చెక్కుల అందజేత
వెల్గటూర్, జూలై 8: ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 348 మంది ఆర్అండ్ఆర్ శ్రీపాద ఎల్లంపల్లి భూ నిర్వాసితుల యువతీ, యువకులకు పునరావాస ప్యాకేజీ రూ.2లక్షల చొప్పున 6.96కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ముంపు గ్రామాల ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. భూ నిర్వాసితులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే వెంటనే ప్యాకేజీ మంజూరు చేయించి చెక్కులను అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం, అధికారులు కృషి చేస్తుంటే కొందరు మధ్యవర్తులు తమ వల్లే పథకాలు వస్తున్నాయని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మద్దని సూచించారు.
చెగ్యాం, రాంనూర్, మొక్కట్రావ్పేటలో మిగిలిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మొక్కట్రావ్పేట గ్రామానికి చెందిన 350బీసీ కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున పరిహారం అందించడానికి నిధులు మంజూరయ్యాయని, కేబినెట్ ఆమోదం పొందడంతో వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. అనంతరం కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా పరిహారం, ఇతర ప్రయోజనాలు అర్హత ఉన్నవారికే వస్తాయని.. అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో రావని, ఎవరైనా ఇప్పిస్తామని డబ్బులు అడిగితే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం 72మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 77లక్షల 8వేల 932ల విలువైన చెక్కులను, సీఎం సహాయ నిధి కింద మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52మంది లబ్దిదారులకు 22లక్షల 68వేల విలువైన చెక్కులను అందజేశారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కొప్పుల ఈశ్వర్
దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగదేవ్పేటలో ఎస్సీ 50 మంది యువతుల కోసం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దళిత యువతులు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించి వారి కుటుంబాలకు చేదోడుగా ఉండాలనే సదుద్దేశ్యంతో ఒక్కో మహిళకు 15 నుంచి 20 వేల వరకు ఖర్చు పెడుతూ నిపుణులతో ఉచిత శిక్షణ అందిస్తున్నదని చెప్పారు. శిక్షణ పూర్తయ్యాక ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు ఉంటాయని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న దుస్తులు కుట్టే ఏజెన్సీలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి ప్రభుత్వ పాఠశాలలో మొక్క నాటి, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, ఆర్డీవో మాధురి, జడ్పీటీసీ సుధారాణి, ఏఎంసీ చైర్మన్ ఎలేటి కృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు బూర రాంరెడ్డి, గోలి రత్నాకర్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ చుక్క శంకర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్, సర్పంచులు నక్క మౌనిక, సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ, రామిల్ల లావణ్య, ద్యావనపెల్లి లక్ష్మి, బోడుక మంజుల, యాగండ్ల తిరుపతి, బోడకుంట రమేశ్, గంగుల నాగేష్, మేరుగు మురళి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ లక్ష్మినారాయణ, స్పేషల్ ఆఫీషర్ నరేశ్ ఉన్నారు.