న్యూఢిల్లీ: కరోనా టీకా కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాకు దేశవ్యాప్తంగా వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వై క్యాటగిరి కింద ఇద్దరు కమాండోలు, పోలీసులతో కలిపి 11 మంది సిబ్బంది భద్రతగా ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు అదర్ పూనావాలాకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తుంది.
మే 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మూడో దశ ప్రారంభంకానున్నది. 19-44 ఏండ్ల వయసు వారికీ కరోనా టీకాలు వేస్తారు. దీని కోసం కోవిన్ వెబ్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసే సిరం సంస్థ సీఈవో అదర్ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరి భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.