ముంబై, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): హక్కుల సాధన కోసం, న్యాయం కోసం కోర్టు మెట్లెక్కేందుకు ప్రజలు వెనుకాడకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయం సకాలంలో అందించకపోతే వాద-ప్రతివాదులు ఇబ్బందులకు గురవ్వడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థికంగా కూడా భారం పడుతుందని పేర్కొన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ నూతన భవన సముదాయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. కోర్టుల్లో సత్వర న్యాయం అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమర్థ న్యాయవ్యవస్థ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి సాధిస్తుందన్నారు. 2018లో ప్రచురితమైన అంతర్జాతీయ పరిశోధనలను ఈ సందర్భంగా ఉటంకించిన ఆయన.. సకాలంలో న్యాయం అందించడంలో న్యాయస్థానాలు విఫలమైతే, వార్షిక జీడీపీలో 9 శాతం దేశానికి ఖర్చు అవుతుందని చెప్పారు. దేశంలో న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయల కల్పన కోసం తగిన ప్రణాళికలు లేకపోవడం సరికాదన్నారు. కాగా, జస్టిస్ రమణ కంటే ముందుగా కేంద్రన్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమిపై జస్టిస్ ఎన్వీ రమణ.. కేంద్రమంత్రి సమక్షంలోనే పై వ్యాఖ్యలు చేశారు.
శిథిల భవనాల్లోనే న్యాయస్థానాలు
దేశంలోని పలు కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, అలాంటి భవనాల్లోనే కోర్టుల నిర్వహణ జరుగుతున్నదని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. 5% కోర్టుల్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, 16% కోర్టుల్లో టాయిలెట్స్ కూడా లేవని, మరో 26 % కోర్టు భవనాల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలనేపథ్యంలోనే మౌలిక వసతుల కోసం ‘నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అథారిటీ’ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.
అది మీ హక్కు
నిందితులు, నేరస్థులు లేదా బాధితులు మాత్రమే కోర్టును ఆశ్రయిస్తారని ప్రజలు అనుకుంటారు. చాలా మంది తమ జీవితకాలంలో కోర్టు మెట్లు ఎక్కలేదని గర్వంగా చెప్పుకుంటారు. ఇలాంటి భావన నుంచి ప్రజలు బయటకు రావాలి. హక్కుల సాధన కోసం కోర్టులను ఆశ్రయించేందుకు ప్రజలు ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు. ఇది రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు.