హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది. శుక్రవారం 59,705 నమూనాలను పరీక్షించగా, 1,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 5 నెలల తర్వాత వెయ్యికి పైగా కేసులు రికార్డు కావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రతి రోజు 60 వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 283 కేసులు రికార్డయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 113, రంగారెడ్డిలో 104, నిజామాబాద్లో 75, సంగారెడ్డిలో 46, జగిత్యాలలో 40, కరీంనగర్లో 34, వరంగల్ అర్బన్లో 27 కేసులు నమోదైనట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఆరుగురు మృతి చెందగా, ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 1,712కు చేరుకున్నది. మరోవైపు యాక్టివ్ కేసులు 6,900కు చేరుకున్నాయి.
54 వేల మందికి తొలిడోస్
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా శుక్రవారం 54,059 మందికి తొలిడోస్ వేశారు. 3,758 మంది రెండోడోస్ తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు తొలిడోస్ తీసుకున్నవారి సంఖ్య 11.3 లక్షలకు చేరుకోగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 2.4 లక్షలకు చేరుకున్నట్టు వైద్యారోగ్యశాఖ శనివారం విడుదలచేసిన బులెటిన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథా కేవలం 2.51 శాతం మాత్రమే ఉన్నదని, ఇది దేశంలోనే అత్యల్పమని స్పష్టంచేసింది.