ముంబై: మురికి కాలువ పూడిక తీయని కాంట్రాక్టర్కు మహారాష్ట్రకు చెందిన శివసేన ఎమ్మెల్యే బహిరంగంగా శిక్ష విధించారు. నీరు నిలిచిన రోడ్డుపై కూర్చోబెట్టడంతోపాటు ఆయనపై చెత్త పోయించారు. ఉత్తర ముంబైలోని కండివాలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దిలీప్ లాండే అందరూ చూస్తుండగానే ఈ చర్యకు పాల్పడ్డారు. మురికి కాలువలో పూడికను కాంట్రాక్టర్ తీయించడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో వర్షా కాలంలో కాలువలు నిండి వర్షం నీరు రోడ్లపై పారుతున్నదని విమర్శించారు. స్థానిక పార్టీ చీఫ్, శివసైనికులతో కలిసి తాను ఇక్కడకు వచ్చి కాలువ పూడిక తీయించినట్లు చెప్పారు. ఎన్నికైన తనతో పాటు కాంట్రాక్టర్కు కూడా బాధ్యత ఉన్నదని, అందుకే ఆయనను పిలిపించి బుద్ధి చెప్పామన్నారు.