ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతూ బహిరంగసభలను నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పలు పార్టీలు కూడా బరిలో తమ అభ్యర్థులను నిలుపుతుండటంతో ఎన్నికల వాతావరణం భిన్నంగా మారింది. ఇలాఉండగా, తృణమూల్ కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతుండగా.. బీజేపీపై తమకున్న కోపాన్ని తీర్చుకునేందుకు శివసేన సిద్ధమైంది. మమతతో దోస్తీ కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన శివసేన.. మమతా బెనర్జీకి పూర్తి మద్దతు ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి 1998 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన మమతా బెనర్జీ.. 2011 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అనంతరం మరో దఫా కూడా అధికారాన్ని నిలుపుకున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్పై కన్నేసిన బీజేపీ.. మమతను బలహీనపర్చే కుట్రల్లో భాగంగా ఆమె ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులకు గాలం వేసి పార్టీలో చేర్చుకున్నది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు బెంగాల్లోనే మకాం వేసి పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. బీజేపీ పేరెత్తితేనే అంతెత్తున లేస్తున్న శివసేన.. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి రావాలంటూ మమత పంచన చేరింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనవరి 17 న శివసేన ప్రకటించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పోటీని విరమించుకుని మమతా దీదీకి మద్దతుగా నిలువాలని నిర్ణయించింది. ‘మమత దీదీ కాదు.. రాయల్ బెంగాల్ పులి’ అని మమతను శివసేన ఆకాశానికి ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిపార్టీలో బరిలో నిలిచినా.. అందరూ మమతకు పోటీగానే ఉన్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో సమావేశం అనంతరం మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు సంజయ్ చెప్పారు. మమతను ఓడించేందుకు మనీ, మజిల్, మీడియాను ఉపయోగిస్తున్నారని.. అందుకే మమతకు అండగా నిలువాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, మమతా బెనర్జీకి ఇప్పటికే రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.