ఝాల్డా, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఏ కుట్రలూ తనను అడ్డుకోలేవని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ‘కొద్ది రోజులు ఓపిక పట్టండి. నా కాళ్లు బాగవుతాయి. అప్పుడు బెంగాల్ గడ్డపై మీ కాళ్లు స్వేచ్ఛగా నడుస్తాయో లేదో నేనూ చూస్తా’ అని ప్రత్యర్థులను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చిందని, అయినా వారికి బెంగాల్ దక్కదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలుగురు సిట్టింగ్ ఎంపీలను బరిలో నిలుపడంపై మమత విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కోసం వారు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఝార్గ్రామ్లో అమిత్ షా జనం లేక సభను రద్దు చేసుకున్నారని, తమను అడిగి ఉంటే జనాన్ని పంపించేవాళ్లం కదా అని చురకలంటించారు. మరోవైపు, తనపై ఉన్న క్రిమినల్ కేసులను మమత నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని, ఆమె నామినేషన్ను రద్దు చేయాలని సువేందు అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు.
తృణమూల్ గూండాల చేతిలో హత్యకు గురైన 130 మంది బీజేపీ కార్యకర్తల తల్లుల బాధేంటో మీకు తెలుసా అని కేంద్రమంత్రి అమిత్షా సోమవారం రాణిబంద్లో నిర్వహించిన ఎన్నికల సభలో మమతను ప్రశ్నించారు.