న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరింది. ఇందులో 1,53,84,418 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 31,70,228 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 2,08,330 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2,97,540 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 15,22,45,179 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 66,159 కేసులు ఉండగా, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్య రికార్డయ్యాయి. ఇక న్యూఢిల్లీలో 24,235 మందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్లుగా నిర్ధారణ అవుతున్నారు.
కాగా, దేశంలో ఈ ఏడాదిలో మొదటిసారిగా రోజువారీ కేసులు లక్షకుపైగా కేసులు ఏప్రిల్ 6న నమోదయ్యాయి. నెల చివరినాటికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉన్నది. ఈనెల 6న 1.15 లక్షల కేసులు నమోదవగా, ఏప్రిల్ 13న వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. అదేవిధంగా ఏప్రిల్ 15 నాటికి రోజువారీ కేసులు 2 మార్కును దాటగా, ఈ నెల 20న మరణాల సంఖ్య 2 వేలకు చేరింది. కేవలం ఆరు, ఏడు రోజుల్లోనే రోజువారీ కేసులు 3 లక్షలు, మరణాలు 3 వేలు దాటాయి. ఏప్రిల్ 21న 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఏప్రిల్ 27న మూడువేల కంటే ఎక్కువగా మరణాలు రికార్డయ్యాయి. దీనినిబట్టి ముందుముందు రోజువారీ కేసులతోపాటు, మరణాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..