పూరీ, సెప్టెంబర్ 19: పూరీలో రామానుజాచార్య స్థాపించిన ఎమర్ మఠం వద్ద నిధి కోసం అన్వేషణ సాగుతున్నది. జగన్నాథ ఆలయానికి ఆగ్నేయంగా ఉన్న ఈ మఠం ఆవరణలో ఆర్కియాలజిస్టులు మెటల్ డిటెక్టర్లతో శోధిస్తున్నారు. ఉత్తరపార్శ మఠం అధిపతి (మహంత్) నారాయణ్ రామానుజదాస్ విజ్ఞప్తి మేరకు అధికారులు అన్వేషణ చేపట్టారు. ఎమర్ మఠానికి ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మఠం ఆవరణలో నిధి ఉండవచ్చని మఠం అధికారులు, చరిత్రకారులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు విలువైన వస్తువులు బయల్పడటంతో ఇక్కడ నిధి దొరకవచ్చన్న నమ్మకం వారిలో బలపడింది. 2011లో మఠం లోపల 522 వెండి కడ్డీలు వెలుగుచూశాయి. 18 టన్నుల బరువున్న వాటి విలువ దాదాపు రూ.90 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్లో మరో 45 వెండి కడ్డీలు దొరికాయి. ఒక్కోదాని బరువు 35 కేజీలు తూగింది. వీటితో పాటు వెండిచెట్టు, పూలు, 16 పురాతన ఖడ్గాలు, గోవు కాంస్యం శిల్పం లభించాయి.
మఠం చరిత్ర
1050లో రామానుజాచార్య పూరి వచ్చినప్పుడు 18 మఠాలు స్థాపించారు. వాటిలో ఎమర్ మఠం ఒకటి. ఈ మఠాలకు పూరీ జగన్నాథస్వామి ఆలయానికి అనుబంధం ఉన్నది. ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, పూజాదికాల్లో ఈ మఠాల భాగస్వామ్యం ఉంటుంది. ఎమర్ మఠానికి గోవిందాచార్య తొలి అధిపతి. ఆయన రామానుజాచార్యకు సోదరుడు అవుతారు.
ఎలా తెలిసింది?
పదేండ్ల క్రితం తొలిసారిగా మఠంలో వెండికడ్డీలు చిత్రంగా బయటపడ్డాయి. మఠంలో మరమ్మతు పనులు చేస్తున్న ఇద్దరు మేస్త్రిలు రెండు వెండికడ్డీలు విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. మఠంలో దొరికాయని మేస్త్రిలు తెలిపారు. దాంతో పోలీసులు తీగలాగడంతో వెండి కడ్డీలతో నిండిన గదిని గుర్తించారు. 1866లో ఒడిశాలో కరువు ఏర్పడినప్పుడు మఠం వద్ద పుష్కలంగా ఉన్న ధాన్యాన్ని సామూహిక వంటశాలల కోసం బ్రిటిషర్లు కొన్నారని, నగదు బదులు మఠానికి వెండికడ్డీలు ఇచ్చారని చరిత్ర చెబుతున్నట్టు ఆర్కియాలజిస్ట్ అనిల్ ధీర్ తెలిపారు.