న్యూఢిల్లీ, మార్చి 18: ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎలా వ్యాపిస్తుందో తెలియదు. ఏ వాతావరణంలో జీవిస్తుందో తెలియదు. మందులకు లొంగదు. కరోనా మహమ్మారి గురించి కాదు ఇదంతా. అంతకన్నా ప్రమాదకరమైన ఓ ఫంగస్ను భారత శాస్త్రవేత్తలు అండమాన్ దీవుల్లో గుర్తించారు. దాని పేరు క్యాండిడా ఆరిస్. అండమాన్లోని రెండు ప్రాంతాల్లో దీనిని గుర్తించారు. దీనినే సీ.ఆరిస్ అంటారు. ఔషధాలకు లొంగని కారణంగా సూపర్ బగ్ అని కూడా పిలుస్తారు. కరోనా కన్నా ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని, ఈ ఫంగస్ విస్తరిస్తే ఏడాదిలో కోటి మందికిపైగా చనిపోవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. భారతదేశంలో ఈ ఫంగస్ను గుర్తించడం ఇదే తొలిసారి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అనురాధ చౌదరి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అండమాన్ దీవుల్లోని 8 ప్రాంతాల్లో మట్టి, నీటి నమూనాలను సేకరించింది. ఇందులో రెండు ప్రాంతాల్లో సేకరించిన నమూనాల్లో సీ.ఆరిస్ కనిపించింది. అందులో జనసంచారం ఎక్కువగా ఉండే ఓ బీచ్ కూడా ఉన్నది. ఫంగస్ ఇక్కడే పుట్టిందా.. మనుషుల నుంచి ఇక్కడకు చేరిందా అన్నదానిపై స్పష్టత లేదు.
ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందన్న విషయం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మిస్టరీనే. వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణం కావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫంగస్ను మొట్టమొదట 2009లో జపాన్లో ఓ రోగి శరీరంలో గుర్తించారు. 2019లో 270 మందిలో ఇది కనిపించింది. వీరిలో 8 మంది చనిపోయారు. ఈ ఫంగస్ మనిషి శరీరంపై చేరి అక్కడే ఉండిపోతుంది. గాయం అయినప్పుడు దాని గుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. ఇది సోకినప్పుడు మొదట ఏ లక్షణాలు కనిపించవు. కొద్ది రోజుల తర్వాత తీవ్ర చలి జ్వరం వస్తుంది. సెప్సిస్కు దారితీస్తుంది. మందులకు సులభంగా లొంగని కారణంగా ప్రాణాపాయం ఎక్కువ.