న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిపోయే విమానాలకు అధికారులు కొన్ని పరిమితులు విధించారు. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్మెన్- NOTAM) జారీచేశారు. ఈ నోటిస్ ప్రకారం.. షెడ్యూల్డ్ విమానాలు అన్నీ షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఆర్మీకి చెందిన హెలిక్యాప్టర్లతోపాటు.. ముఖ్యమంత్రులు, గవర్నర్ల ప్రయాణాల కోసం వినియోగించే రాష్ట్రాల సొంత హెలిక్యాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్లపై ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు.
అయితే, చార్టెడ్ ఫ్లైట్స్ (నాన్ షెడ్యూల్డ్ ఫ్లైట్స్), నో ట్రాన్సిట్ ఫ్లైట్స్ రాకపోకలకు మాత్రం పరిమితులు వర్తిస్తాయన్నారు. ఆ విమానాలు ల్యాండయ్యేందుకు రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రేపు ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో అధికారుల చార్టెడ్ ఫ్లైట్స్ ఆపరేషన్స్పై కొన్ని పరిమితులు విధించారు.