న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనా.. కాదా.. అన్న అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు రైతులు ఇంకా నిరసనలు కొనసాగించడంలో అర్థం ఏంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పౌరులకు నిరసన తెలిపే హక్కుతో పాటు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. దాన్ని గౌరవించాలని, ఈ రెండు హక్కుల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రైతులు సత్యాగ్రహం చేపట్టేందుకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కిసాన్ మహాపంచాయత్ రైతు సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మహాపంచాయత్ న్యాయవాది, సుప్రీంకోర్టు మధ్య ఆసక్తికర వాదనలు జరిగాయి.
తొలుత కిసాన్ మహాపంచాయత్ తరఫు న్యాయవాది.. జంతర్ మంతర్లో సత్యాగ్రహానికి అనుమతించాలని, అందుకు ఆదేశాలను జారీ చేయాలని కోర్టును కోరారు. దీనిపై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం ‘ఇప్పటి దాకా ఢిల్లీ చుట్టూ నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి చేస్తాం అంటున్నారు. మీరు ఒక్కసారి కోర్టుకు వచ్చాక న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి. కేసు పెండింగ్లో ఉండగానే నిరసనలు విస్తరించుకొంటూ పోతామంటే ఎలా? మీరేమైనా న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్నారా?’ అని ఘాటుగా ప్రశ్నించింది. దీనికి రైతు సంఘం తరఫు న్యాయవాది ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఆందోళనలను విస్తరించడానికి బదులు పిటిషన్పై వేగంగా విచారణ జరుపాలని కోర్టును కోరవచ్చని సుప్రీం కోర్టు సూచించింది.
‘మీరు మొత్తం ఢిల్లీ గొంతు నొక్కేశారు. ఇప్పుడు నగరం లోపలికి వచ్చి ఆందోళన చేస్తాం అంటున్నారు. మరోవైపు చట్టాలను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. మీరు ఒక్కసారి కోర్టుకు వచ్చాక న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి.’
సుప్రీంకోర్టు
నిరసన తెలిపే చోట అక్కడి ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళనలు జరుపుతున్న ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించారా.. అక్కడ నిరసనలు తెలుపడానికి వారి అనుమతి కోరారా.. అని అడిగింది. రోడ్లను బ్లాక్ చేసిన రైతులు సెక్యూరిటీ సిబ్బందిని కూడా అడ్డుకొన్నట్టు వార్తల్లో చూశామని పేర్కొన్నది. రైతులు శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నారని రైతు సంఘం న్యాయవాది బదులివ్వగా..‘శాంతియుత నిరసన ఏంటి? రైళ్లను అడ్డగిస్తారు. రోడ్లను బ్లాక్ చేస్తారు. ఇప్పుడేమో మాది శాంతియుత నిరసన, ప్రజలకు ఏం ఇబ్బంది లేదు అంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులే రోడ్లను బ్లాక్ చేశారని రైతుల తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పండి అని కోర్టు ఆదేశించింది. దీనికి రైతు సంఘం న్యాయవాది సరేనన్నారు. విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో దాదాపు ఏడాది కాలంగా నిరసనలు తెలుపుతున్నారు.