న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఎస్బీఐ నివేదిక హెచ్చరించింది. మనం ముందస్తుగా సన్నద్థమైతే కరోనా మరణాల సంఖ్యను తగ్గించవచ్చని పేర్కొంది. ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక ప్రకారం కొవిడ్-19 సెకండ్ వేవ్ 98 రోజుల పాటు ఉంటుందని తెలిపింది. అగ్రదేశాల్లో థర్డ్ వేవ్ సగటున 98 రోజులు ఉంటుందని, సెకండ్ వేవ్ వ్యవధి 108 రోజులని పేర్కొంది. కొవిడ్ సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ తీవ్రత అధికమని అంతర్జాతీయ అనుభవం వెల్లడిస్తోందని తెలిపింది.
థర్డ్ వేవ్ కు మనం సన్నద్ధమైతే సీరియస్ కేసుల సంఖ్య తగ్గించడం ద్వారా మరణాల రేటును పరిమితం చేయవచ్చని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడం, ఆరోగ్య మౌలిక వసతుల పెంపు వంటి సన్నద్ధత సాధిస్తే థర్డ్ వేవ్ లో మరణాల సంఖ్యను 40,000కు తగ్గించవచ్చని అంచనా వేసింది. సెకండ్ వేవ్ లో ఇప్పటికే 1.7 లక్షలకు పైగా కరోనా మరణాలతో పోలిస్తే ముందస్తు ఏర్పాట్లతో థర్డ్ వేవ్ ను సమర్ధంగా మనం కట్టడి చేయవచ్చని తెలిపింది. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే అంచనాల నడుమ వారికి వ్యాక్సినేషన్ చేపట్టడం కీలకంగా ముందుకు సాగాలని పేర్కొంది.