77 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ కూటమి
మజూలీ స్థానంలో సీఎం సర్బానంద ముందంజ
రెండోసారి కాషాయకూటమికి అధికారం
గువాహటి, మే 2: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి విజయం సాధించిన తొలి కాంగ్రెస్సేతర పార్టీగా బీజేపీ నిలిచింది. మొత్తం 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో 77 స్థానాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 45 స్థానాలలో ఆధిపత్యం చూపుతున్నది. అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 64 సీట్లు కావాలి. ఆదివారం సాయంత్రం వెల్లడైన ఫలితాల సరళిని బట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావలసిన మెజారిటీ బీజేపీ కూటమికి లభించింది. బీజేపీ 58 స్థానాల్లో, దాని మిత్రపక్షాలు అసోం గణపరిషద్ 11, యునైటెడ్ పీపుల్స్ పార్టీ-లిబరల్ ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 28, దాని మిత్రపక్షాలు ఏఐయూడీఎఫ్ 14, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 2 చోట్ల, సీపీఎం ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.
ఆధిక్యంలో ప్రముఖులు
రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజూలీలో, ఆరోగ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జలుక్బరీలో, ఏజీపీ అధ్యక్షుడు, మంత్రి అతుల్ బోరా బొకాఖాట్తో ముందంజలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్ దాస్ పత్చర్కుచిలో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా పరాజయం పాలయ్యారు.