చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ, ఆ పార్టీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వంను ఓదార్చారు. ఆయన భార్య విజయలక్ష్మీ మరణంపై తన సంతాపాన్ని తెలిపారు. చెన్నైలోని జెమ్ ఆసుపత్రిలో పన్నీర్ సెల్వంను శశికళ బుధవారం కలిశారు. భార్యను కోల్పోయిన బాధలో ఉన్న ఆయన చేతులు పట్టుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాలపాటు పన్నీర్తో ఆమె మాట్లాడారు. చనిపోవడానికి ముందు ఆయన భార్య అనారోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, వీరిద్దరి భేటీ నేపథ్యంలో అన్నాడీఎంకే రాజకీయాలపై మరోసారి చర్చకు తెరలేచింది.
జయలలిత సీఎంగా ఉన్నప్పుడు, ఆమె మరణాంతరం అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన చిన్నమ్మ శశికళ, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అన్నాడీఎంకే పగ్గాలు ఆమెకు దక్కకుండా ఉండేందుకు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమెతో సంప్రదింపులు జరిపిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
అయితే, అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు శశికళ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీని తిరిగి గాడిలో పెడతానంటూ ఇటీవల తన మద్దతుదారులతో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. పార్టీలోని కొందరు తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లే ముందు పన్నీర్ సెల్వంను సీఎంగా చేసి ఉండేదానినని అన్నారు. కాగా, ఈ ఆడియో క్లిప్ అన్నాడీఎంకేలో కలకలం రేపింది.
మరోవైపు మరణానికి ముందు పార్టీ మాజీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ను కూడా శశికళ ఇటీవల ఆసుపత్రిలో కలిశారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అక్కడున్న మాజీ సీఎం పళనిస్వామి హడావుడిగా బయటకు వెళ్లిపోయారు.