న్యూఢిల్లీ: ఇటీవల సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ భేటీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను అవమానించినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ విలీన అంశంలో సర్దార్ పటేల్ను కాంగ్రెస్ తప్పుగా చిత్రీకరించిందని ఆయన అన్నారు. వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. సీడబ్ల్యూసీ సభ్యుడు తారిక్ హమీద్ కర్రా తప్పుడు అభిప్రాయాలు వెల్లడించినట్లు సంబిత్ పాత్ర తెలిపారు. భారత్ నుంచి జమ్మూకశ్మీర్ను వేరు చేసేందుకు సర్దార్ పటేల్ ప్రయత్నించారని, కానీ నెహ్రూ ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలిపేందుకు ప్రయత్నించినట్లు తారిక్ సీడబ్ల్యూసీ సమావేశంలో అన్నారని బీజేపీ నేత ఆరోపించారు. కశ్మీర్ను ఇండియా నుంచి విడదీసేందుకు జిన్నాతో కలిసి సర్దార్ చేతులు కలిపినట్లు తారిక్ చెప్పారని బీజేపీ నేత అన్నారు. తారిక్ చేసిన ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అభ్యంతరం వ్యక్తం చేశారా అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తారిక్ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.