శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చుకులు స్వామివారికి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపించారు.
శ్రీభ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. సాయంత్రం సాయంకాల పూజలు, జపానుష్టాధి పూజాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్పమూర్తులను కైలాస వాహనంపై వేంచెంబుజేసి ప్రత్యేక పూజలు చేశారు.
కైలాసవాహనాన్ని అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శ్రీశైల భ్రమరాంబ మహాదుర్గ అలంకరణలో భక్తులను కరుణించింది. అష్టభుజాలు కలిగి పద్మం, శంఖం, చక్రం, గధ, త్రిశూలం, ఖడ్గం ధరించి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి శత్రు బాధలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వాహన పూజల అనంతరం ఆదిదంపతుల గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో కోలాటం, పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఈఓ కెఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి, శ్రీహరి, పర్యవేక్షకులు ఉమేశ్ పట్వారీ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి