న్యూఢిల్లీ : అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. బీజేపీకి రాముడి కంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్లపైనే విశ్వాసం ఉందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. భూ కుంభకోణంపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం మూడు రోజులు వేచిచూశానని, ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు.
అయోధ్యలోని బగ్ బిజైసి గ్రామంలో రూ 2 కోట్ల విలువైన భూమిని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఏకంగా రూ 18.5 కోట్లకు కొనుగోలు చేశారని సింగ్ ఆరోపించారు. కొద్ది నిమిషాల ముందే రూ 2 కోట్లకు భూమిని కొనుగోలు చేసిన వారి నుంచి భారీ మొత్తం వెచ్చించి ట్రస్ట్ కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీచే దర్యాప్తు జరిపించాలని ఆప్ ఎంపీ డిమాండ్ చేశారు.