ముంబై : మోదీ క్యాబినెట్లో మంత్రి పదవులను నింపేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చినందుకు శివసేన, ఎన్సీపీలకు బీజేపీ ధన్యవాదాలు తెలపాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాషాయ పార్టీకి చురకలు అంటించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కిన కపిల్ పాటిల్, భారతి పవార్లు గతంలో ఎన్సీపీలో ఉన్నారని, ఇక ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే గతంలో శివసేనతో పాటు, కాంగ్రెస్లో పనిచేశారని రౌత్ గుర్తుచేశారు.
మహారాష్ట్రకు చెందిన నలుగురు నేతలు మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయగా వారిలో ముగ్గురికి బీజేపీ నేపథ్యం లేదని చెప్పుకొచ్చారు. నారాయణ్ రాణే స్ధాయికి తగిన శాఖను కేటాయించలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణే గతంలో కీలక శాఖలను నిర్వహించారని చెప్పారు. ఎంఎస్ఎంఈ మంత్రిగా చిన్న మధ్యతరహా పరిశ్రమల పునరుద్దరణ ఆయనకు సవాల్గా మారనుందని అన్నారు. బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ను క్యాబినెట్ నుంచి తప్పించడంపై విమర్శలు గుప్పించారు.