కడ్తాల్, జూన్ 25 : గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన్నట్లు ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఎంపీడీవో సూచించారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిద్రించారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మంచాలలో సమస్యలపై ఆరా..
మంచాల, జూన్ 25 : పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాత్రి మంచాల పంచాయతీలో అధికారులు పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు గ్రామంలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..గ్రామంలో కొన్నిచోట్ల తాగునీటి పైపులైన్లు లీకేజీ అవుతున్నాయని, ఐదుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోయి ఉన్నాయని, దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలని దోమల నివారణకు రసాయనాలు పిచికారీ చేయాలని ప్రజలు అధికారులకు సూచించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ అనిరెడ్డి జగన్రెడ్డి, ఎంపీటీసీ నరేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి ..
ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 25 : కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని నాగన్పల్లిలో గురువారం రాత్రి ఎంపీడీవో మహేశ్బాబు పల్లెనిద్ర చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వీధి దీపాలు, మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేయడం, దోమల నివారణకు రసాయనాలు చల్లడం, ఇంటింటికీ చెత్తసేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..గ్రామంలో పల్లెనిద్రలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పల్లెనిద్రలో సర్పంచ్ జగన్, ఎంపీటీసీ మంగ, ఉపసర్పంచ్ బీరప్ప, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జంగయ్యతో పాటు గ్రామస్తులు, వార్డుమెంబర్లు పాల్గొన్నారు.
పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములవ్వాలి..
ఆమనగల్లు, జూన్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో పల్లెల దశ మారిందని, కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఎంపీడీవో వెంక్రటాములు కోరారు. కలెక్టర్ అమయ్కుమార్ ఆదేశాలతో ఎంపీడీవో వెంకట్రాములు సీతారాంనగర్ తండాలో పల్లెనిద్రలో పాల్గొన్నారు. సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పల్లెప్రగతి, పారిశుధ్య నిర్వహణ, ఆరోగ్యం, తడిపొడి చెత్త, గిరిజన వికాస పథకాలకు సంబంధించి తండావాసులకు అవగాహన కల్పించారు.
కవాడిపల్లిలో పల్లె నిద్ర ..
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 25 : మండలంలోని కవాడిపల్లిలో సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమన్ని గురువారం రాత్రి నిర్వహించారు. జడ్పీటీసీ దాస్గౌడ్, ఎంపీడీవో దేవేందర్రెడ్డితో కలిసి గ్రామంలోని వీధుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో సమస్యలు లేకపోవడంతో అధికారులు సర్పంచ్, పాలకవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
యాచారంలో పల్లెనిద్ర..
యాచారం, జూన్ 25 : మండలంలోని మాల్ గ్రామంలో ఎంపీడీవో మమతాబాయి పల్లె నిద్ర చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ ఇస్రత్బేగం, ఎంపీడీవో, ఏపీవో లింగయ్య రాత్రి గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో ఎంపీటీసీ ఇస్రత్బేగం, సర్పంచ్ కవిత మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.