ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ అస్ధిరతను సృష్టిస్తోందని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాణే అరెస్టు వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని బీజేపీ చేసిన ఆరోపణలను రౌత్ తోసిపుచ్చారు. అనిల్ దేశ్ముఖ్, ప్రతాప్ సర్నాయక్ల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, వారిపై బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉద్దేశపూరితంగా ప్రయోగించలేదా అని ఆయన ప్రశ్నించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పై ఉద్ధవ్ ఠాక్రే చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఠాక్రేపై కాషాయ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంపై సంజయ్ రౌత్ స్పందిస్తూ పాత వీడియోపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఆరేండ్ల నాటి ఘటనపై వారు ఇప్పుడు మేల్కొన్నారని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల విషయంలో మహారాష్ట్రను బీజేపీ నేతలు బెంగాల్తో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. బెంగాల్లో బీజేపీకి ఎదురైన ఓటమి మహారాష్ట్రలోనూ పునరావృతమవుతుందని రౌత్ అన్నారు.