జస్టిస్ రాధాబినోద్ పాల్.. ఈ వ్యక్తి గురించి చాలామందికే తెలియదు. చరిత్ర పుటల్లో కూడా ఆయన కనుమరుగైపోయారు. ఇంకా చెప్పాలంటే చరిత్రకారులు సైతం ఆయన్ను మరిచారు. పుట్టిన దేశం కూడా ఆయన్ను మరిచిపోయినా.. జపనీయులు మాత్రం ఇప్పటికీ తమ గుండెల్లో నిలుపుకున్నారు. తమ ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. ఆలయంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవిస్తున్నారు. ఇంతకీ ఎవరీ జస్టిస్ రాధాబినోద్ పాల్. ఎక్కడో బెంగాల్లో పుట్టిన ఆయన.. జపాన్లో ఆరాధ్యుడు ఎలా అయ్యారు?
రాధాబినోద్ పాల్ 1886 జనవరి 27న అప్పటి బెంగాల్ ప్రావిన్స్లో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం చదువుకున్నారు. 1927లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన్ను న్యాయ సలహాదారుగా నియమించింది. 1923 నుంచి 1936 వరకు కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. 1944లో అదే వర్సిటీకి వైస్ చాన్స్లర్గా కూడా పనిచేశారు. 1941లో కలకత్తా హైకోర్టు జడ్జిగా కూడా నియమితులయ్యారు. 1952 నుంచి 1966 వరకు ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ న్యాయ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. 1967 జనవరి 10న కన్నుమూశారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, భాగస్వామ్య పక్షాలపైన ఇటలీ, జర్మనీ దేశాలు ఓటమి పాలయ్యాయి. యుద్ధంలో గెలిచిన మిత్రపక్ష దేశాలన్నీ జపాన్కు వ్యతిరేకంగా మారాయి. ఆసియా – పసిఫిక్ దేశాలపై జపాన్ సైన్యం దండెత్తి అనేక ఘోరాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో జపాన్ చేసిన నేరాలకు తగిన శిక్ష విధించాలని మిత్రపక్ష కూటమి దేశాలు నిర్ణయించాయి. జపాన్ ప్రధాని సహా పాలకులు, సైన్యాధికారులతోపాటు వేలమందిపై హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం, ఆక్రమణల కింద కేసులు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఇంటర్నేషనల్ మిలటరీ ట్రిబ్యునల్ ఫర్ ది ఫార్ ఈస్ట్ను ఏర్పాటు చేశారు. దీన్నే టోక్యో ట్రయల్స్ బెంచ్ అని కూడా పిలుస్తారు.
మిత్ర పక్ష కూటమిలోని 11 దేశాల ( ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సోవియట్ యూనియన్, యూకే, యూఎస్తో పాటు భారత్) న్యాయమూర్తులతో కలిసి ఈ బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు మిత్ర పక్ష కూటమి సుప్రీం కమాండ్ డక్లస్ మాక్ఆర్థర్ 1946 జనవరి 19న ప్రకటించారు. ఈ బెంచ్కు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన వ్యక్తే జస్టిస్ రాధాబినోద్ పాల్.
ఈ బెంచ్ నిందితులకు మరణశిక్షలు, జీవిత ఖైదు విధించాయి. అయితే నిందితులకు మరణ శిక్ష విధించడాన్ని బెంచ్ సభ్యులైన జస్టిస్ రాధాబినోద్ ఒక్కరే విబేధించారు. టోక్యో ట్రయల్స్ బెంచ్లో ఆలస్యంగా సభ్యుడైన ఆయన.. ఈ కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దూకుడుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లేవని రాధాబినోద్ అభిప్రాయపడ్డారు. జపాన్ యుద్ధ నేరాలు ఆ దేశ ప్రభుత్వ విధానం కాదని, ఆ నేరాలకు ప్రభుత్వ అధికారులు నేరుగా బాధ్యులు కారని ఆయన వాదించారు. అంతేకాదు శత్రుదేశాలే రెచ్చగొట్టి మరి జపాన్ను యుద్ధంలోకి దిగేలా చేశాయని.. అలాంటప్పుడు ఈ నేరంలో జపాన్ ఒక్క దేశాన్నే బాధ్యులు చేయడం కాదని స్పష్టం చేశారు. 1937 సమయంలో దుందుడుకుగా యుద్ధం చేయడం నేరమేమీ కాదని జస్టిస్ రాధాబినోద్ గుర్తు చేశారు.
ఒక ఘటన జరిగిన తర్వాత చట్టాలు రూపొందించి శిక్షలు వేయడం సరికాదని, అందుకే నిందితులు అందరూ నిర్దోషులేనని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ రాధాబినోద్ వాదనలు బెంచ్లో నెగ్గలేదు. మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం ప్రకారమే తీర్పు వెల్లడైంది. కానీ ప్రపంచమంతా దోషిగా భావించినా.. వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకున్న వారికి అండగా నిలవడంతో జస్టిస్ రాధాబినోద్ను జపనీయులు దేవుడిగా భావించారు. టోక్యో ట్రయల్స్ పూర్తయిన తర్వాత కూడా జస్టిస్ రాధాబినోద్ పలుమార్లు జపాన్లో పర్యటించారు. దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించారు. అంతేకాదు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక ఆసియా దేశం జపాన్ అని ఆయన ఓ సందర్భంలో ప్రశంసలు కూడా కురిపించారు. ఈ సంఘటనలతో జపనీయులకు ఆయన ఆరాధ్యుడు అయ్యారు.
జస్టిస్ రాధాబినోద్కు అప్పటి జపాన్ చక్రవర్తి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ది సాక్రెడ్ ట్రెజర్ అవార్డును కూడా ప్రదానం చేశారు. జపాన్ ప్రజలు కూడా ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన స్మారక చిహ్నాలు, ప్రతిమలను టోక్యోలోని యసుకుని, రియోజెన్ గోకోకు దేవాలయాల్లో ఏర్పాటు చేసి ఆయన్ను ఆరాధిస్తున్నారు. ఏటా ఆయన జయంతి, వర్థంతి రోజు నివాళులర్పిస్తున్నారు. ఇక భారత ప్రభుత్వం కూడా 1959లో పద్మవిభూషణ్తో సత్కరించింది. ఈ టోక్యో ట్రయల్స్పై 2016లో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇందులో జస్టిస్ రాధాబినోద్ పాత్రలో ఇమ్రాన్ఖాన్ నటించారు.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గర్భాశయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అక్కడ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే కోడి ఫ్రీ.. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఆఫర్లు ఉన్నాయంటే..
పొట్టి భర్త పొడగరి భార్య: వరల్డ్ రికార్డును చెరిపేశారు
ఒకే కాన్పులో పది మంది సంతానం : మహిళ కట్టుకథ రట్టు
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?