జోధ్పూర్ : శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. సమయం వృథా చేసుకోకుండా సరైన ప్రణాళిక వేసుకొని కష్టపడితే తప్పక విజయం వరిస్తుంది. శ్రమ, పట్టుదలతో కష్టపడితే అనుకున్న పనిలో విజయం సాధించడం కష్టమేమీ కాదంటారు అనుభవజ్ఞులు. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తుంది రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఆర్ఏఎస్) పరీక్షను క్లియర్ చేసిన శానిటేషన్ వర్కర్ ఆశా కందరా(40). మున్సిపల్ కార్మికురాలిగా వీధులను ఊడ్చే ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి ఆశా కందరా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఎంపికైంది. 2018లో నిర్వహించిన ఆర్ఏఎస్ పరీక్ష ఫలితాలు 13 జులై, 2021న విడుదలయ్యాయి.
కుల వివక్ష, లింగ వివక్ష, వివాహం విచ్చిన్నం కావడం ఇలా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఏనాడు కుంగిపోలేదంది ఆశా కందరా. బదులుగా తిరిగి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. భర్తతో విడిపోయిన తర్వాత విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని నిశ్చయించుకుని 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే తన తండ్రితో పాటు కలిసి జీవించేది. కాగా ఆర్థికంగా స్వతంత్రంగా మారి తన పిల్లలను పోషించాలని కలలు కంటుండేది.
2018లో జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షకు హాజరై స్వీపర్గా ఎంపికైనట్లు ఆశా కందరా తెలిపింది. స్వీపర్గా విధులు నిర్వహిస్తూనే ఆర్ఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్లు వెల్లడించింది. ఆగస్టు 2018లో ప్రిలిమ్స్ను క్లియర్ చేసింది. ఫైనల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు ఇది తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని తెలిపింది. మొత్తంమీద ఆర్ఏఎస్ ను క్లియర్ చేయడంతో ఆశా కందరాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మేయర్, ఇతర సీనియర్ అధికారులు ఆమెకు సన్మానం చేశారు. సీనియర్ అధికారులతో పాటు తోటి అధికారిగా సన్మానం పొందటం గర్వంగా ఉందంది పేర్కొంది. ఇటువంటి గుర్తింపు కోసమే తానెంతగానో కష్టపడ్డట్లు తెలిపింది. ఈ విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఓ పరిపాలనా అధికారిగా సమాజానికి న్యాయం చేసేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. తన ప్రయత్నం కేవలం తన కమ్యూనిటీ కోసం మాత్రమే కాదని అన్యాయానికి గురైన ప్రతి బాధితుడి కోసం అని ఆమె స్పష్టం చేసింది.