పట్నా: బీహార్లో సంకీర్ణ సర్కారుకు సంబంధించి బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌధరి ( Samrat Choudhari ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. బీహార్లో సంకీర్ణ సర్కారు పాలన నడుస్తున్నదని, తమ సొంత పాలన కాదని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కారు కారణంగానే బీహార్లో తాము సరిగా పనిచేయలేక పోతున్నామని, మొత్తం నాలుగు పార్టీల ఐడియాలజీలను కలుపుకుని ఒక్కటిగా పనిచేయడం అంత సులువు కాదని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాము చాలా అంశాలను సహించాల్సి వస్తున్నదని సామ్రాట్ చౌదరి వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీతిశ్కుమార్కు చెందిన జేడీయూ కేవలం 43 స్థానాలను మాత్రమే గెలిచినప్పటికీ 74 స్థానాలు గెలిచిన తాము ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టామని చెప్పారు. ఇది కొత్తేం కాదని, 2000 సంవత్సరంలో కూడా బీజేపీ 69 స్థానాల్లో.. జేడీయూ 37 స్థానాల్లో గెలిచాయని అయినా నితీశ్కుమార్కే సీఎం పదవి అప్పగించామని తెలిపారు. తాము పార్టీని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.